హైదరాబాద్ (Hyderabad) నగర అభివృద్ధి సంస్థ (HYDRA) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. మాదాపూర్ (Madapur) లో ఉన్న సున్నం చెరువు పై దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, గుడిసెలు, వాణిజ్య భవనాలపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జూన్ 30న సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్ స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

ఆక్రమణలపై అధికారుల దాడి
దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) పరిధిలో చట్టవిరుద్ధంగా నిర్మించిన అనేక గుడిసెలను, ఇతర నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా చెరువు సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్లను కూడా తొలగించారు.
అక్రమ నీటి వ్యాపారం – గట్టి చర్యలు
ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో అక్రమ నీటి వ్యాపారం జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొందరు వ్యక్తులు అక్రమంగా బోర్లు వేసి, చెరువు పరిధిలోని భూగర్భ జలాలను తోడేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేశారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పర్యాటక అభివృద్ధి ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వం సున్నం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసి, పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రూ.10 కోట్ల నిధులతో చెరువు అభివృద్ధి పనులను హైడ్రా చేపట్టింది. ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగానే ప్రస్తుతం ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Bhadrachalam : ఆ గ్రామాలను తెలంగాణలో కలపండి – తుమ్మల