హైదరాబాద్(Hyderabad) నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు తీవ్రంగా మారుతున్నాయి. ఐటీ పరిశ్రమ విస్తరణతో పాటు జనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరగడం వల్ల నగరంలోని ప్రధాన రహదారులు నిత్యం కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా నగరం లోపలి ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) చేరుకోవడం వాహనదారులకు పెద్ద పరీక్షగా మారింది. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు తోడుగా మరో రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది.
Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్కు నోటీసులు ఇవ్వనున్న సిట్?
బంజారాహిల్స్–గచ్చిబౌలి మధ్య కొత్త ఎక్స్ప్రెస్వే
నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఒకటి. అక్కడి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి చెక్ పెట్టేలా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు మీదుగా శిల్పా లేఅవుట్ వరకు నేరుగా కలిపే కొత్త ఎక్స్ప్రెస్వేను నిర్మించనున్నారు. సుమారు 10 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ మార్గంలో 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు స్టీల్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఐటీ కారిడార్ వైపు వెళ్లే ఉద్యోగులకు ట్రాఫిక్ బాధలు గణనీయంగా తగ్గనున్నాయి.

ఇక మెహదీపట్నం(Mehdipatnam) నుంచి ORR వైపు వెళ్లే వాహనదారుల కోసం మరో కీలక మార్గాన్ని అధికారులు డిజైన్ చేస్తున్నారు. షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సీబీఐటీ కాలేజీ వరకు ఉన్న ప్రస్తుత రోడ్డును విస్తరించి ఏకంగా 200 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంపై సుమారు 7 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. దీని వల్ల మణికొండ, రాయదుర్గం ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు చేరుకోవడం చాలా సులభంగా మారనుంది.
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్పేట
ఇదిలా ఉండగా, సికింద్రాబాద్ ప్యారడైజ్(Secunderabad Paradise) నుంచి శామీర్పేట ORR జంక్షన్ వరకు నిర్మించనున్న భారీ కారిడార్కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. సుమారు 18.5 కిలోమీటర్ల పొడవుతో రూ.2,232 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను చేపడుతున్నారు. నిర్మాణ బాధ్యతలను బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఆరు లైన్ల ఫ్లైఓవర్తో పాటు హకీంపేట వద్ద అండర్గ్రౌండ్ టన్నెల్ కూడా నిర్మించనున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకునే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ఔటర్ రింగ్ రోడ్డును హైదరాబాద్కు మణిహారంలా అభివర్ణించినా, నగరం లోపల నుంచి అక్కడికి చేరుకోవడమే ఇప్పటివరకు పెద్ద సమస్యగా ఉంది. మెహదీపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, పంజాగుట్ట వంటి కీలక జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా మారింది. ఈ రద్దీని తగ్గించి, వాహనాలు ఎక్కడా ఆగకుండా నేరుగా సిటీ నుంచి ORR చేరుకునేలా చేయడమే ఈ కొత్త కారిడార్ల ప్రధాన లక్ష్యం.
ఈ రహదారి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే ప్రయాణ సమయం మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మంచి ఊపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ నగర రూపురేఖలు మరింత ఆధునికంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: