హైదరాబాద్ నగరంలోని మీర్ చౌక్ ప్రాంతంలో గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ వాణిజ్య భవనంలో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన ప్రాంతం నుంచి కమ్ముకొచ్చిన పొగలు దూరం దాకా కనిపించడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ప్రమాద తీవ్రత – రెస్క్యూ చర్యలు
ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 14 మందిని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలించారు. ఇంకా 30 మందికిపైగా భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. వారికి సహాయం చేయడానికి ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తేనికై తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరలేని వ్యక్తులను క్రేన్లు, హైడ్రాలిక్ ల్యాడర్లు ఉపయోగించి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
రోడ్డు మూసివేత – ట్రాఫిక్ ప్రభావం
ఈ ప్రమాదం నేపథ్యంలో చార్మినార్కు వెళ్లే ప్రధాన రహదారులన్నీ తాత్కాలికంగా మూసివేశారు. ట్రాఫిక్ను ఇతర మార్గాల వైపు మళ్లించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మంటల తీవ్రత, దట్టమైన పొగ కారణంగా పరిసరాల్లో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రమాదానికి కారణం
ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాణిజ్య భవనంగా ఉండటంతో అక్కడ భారీగా స్టాక్ చేసిన వస్తువులు మంటలకు ఆహుతయ్యే అవకాశం ఉంది. మంటల్లో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అంతస్తుల మధ్య చేరలేని స్థితిలో చిక్కుకున్నవారిని క్రేన్లు, ల్యాడర్లు, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్లతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మిస్ వరల్డ్ – ప్రత్యేక ఏర్పాట్ల మద్య అగ్ని ప్రమాదం
ఇదే సమయంలో నేడు మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ సుందరీమణులు ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్ ను సందర్శించనున్నారు. దీంతో సెక్రటేరియట్ వద్ద అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ట్యాంక్ బండ్ మీద సండే-ఫండే ఈవెంట్ కు అంతా సిద్ధం చేశారు. ఇక మిస్ వరల్డ్ లకు సంబంధించి డ్రోన్ షో సైతం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంకుబండ్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
ప్రభుత్వ స్పందన & అప్రమత్తత
ప్రాంతంలో అత్యవసర సేవలు, రెస్క్యూ బృందాలు అప్రమత్తమవ్వడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రభుత్వ అధికారులు ఘటనపై సమీక్ష చేపట్టి, బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టారు.
Read also: Telangana: వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తాం: మంత్రి పొంగులేటి