హైదరాబాద్ నగరాన్ని ఈరోజు (ఏప్రిల్ 18) భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం ప్రారంభమైంది. ఎస్ఆర్ నగర్, అమీర్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, అబిడ్స్, బషీర్బాగ్, హిమాయత్నగర్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది.

భారీ వర్షం దెబ్బకు గంటల పాటు ట్రాఫిక్
మియాపూర్, గచ్చిబౌలి, బహదూర్పల్లి, దుండిగల్, కార్వాన్, మెహదీపట్నం, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుండడంతో వాహనదారులు గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. గాంధీ భవన్ ప్రాంతంలో భారీ చెట్టు నేలకూలడంతో రహదారి పూర్తిగా ఆపబడింది. వర్షం తీవ్రతకు ప్రజలు తడిసి ముద్దవుతుండగా, వాతావరణ కేంద్రం మరో గంట పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.
పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు
పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం, బండ్లగూడలో 8 సెం.మీ., బహదూర్పురలో 7.8 సెం.మీ., నాంపల్లిలో 7 సెం.మీ., చార్మినార్లో 6.6 సెం.మీ., అంబర్పేటలో 5 సెం.మీ., ఖైరతాబాద్లో 4.4 సెం.మీ. వర్షపాతం నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా వర్షం తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయం, రోడ్లపై నీటి నిల్వలు లాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.