హైదరాబాద్ నగరంలో మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టబోతుంది. HCL టెక్నాలజీస్ సంస్థ హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు సందర్భంగా దావోస్లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ, రాష్ట్రంలో పెట్టుబడులకు సన్నద్ధమవుతోంది.
ఈ టెక్ సెంటర్ ఏర్పాటుతో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో నిపుణుల కోసం క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సేవల వంటి ప్రాధాన్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ను టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు తీసుకువెళుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు చురుకుగా పనిచేస్తున్న నేపథ్యంలో HCLతో కుదిరిన ఈ ఒప్పందం గొప్ప విజయంగా నిలిచింది. సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ను టెక్నాలజీ అభివృద్ధికి అనువైన కేంద్రంగా అభివర్ణించారు. ఈ సెంటర్ ద్వారా అత్యాధునిక టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు.
హైదరాబాద్లో ఇప్పటికే అనేక టెక్నాలజీ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించాయి. ఈ జాబితాలో HCL కూడా చేరడం ద్వారా తెలంగాణ టెక్నాలజీ రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో దేశీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులపై సంస్థ మరింత దృష్టి పెట్టనుంది.