సిద్దిపేట (Siddipet) పట్టణంలోని ఖాదర్పుర వీధిలో చోటుచేసుకున్న అనూహ్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం ఉదయం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అదృశ్యమవడం (Five members Missing) ఆందోళనకు దారి తీసింది. బాలకిషన్, ఆయన తండ్రి జనార్దన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రావణ్, కుమార్తెలు కావ్య, శిరీషలు ఇంట్లో ఉన్న సెల్ఫోన్లను కూడా వదిలేసి వెళ్లిపోయారు. మొదట బంధువులు వారు ఏదైనా అవసరాల కోసం ఊరికి వెళ్లి ఉంటారని భావించినా, రెండు రోజులు గడిచినా వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్ధిక ఇబ్బందులు , అప్పులు
బాలకిషన్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అప్పుల భారం పెరిగిపోయిందని బంధువులు తెలిపారు. తనకు రావాల్సిన డబ్బులు రాకపోవడం, వడ్డీలు చెల్లించలేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని తెలుస్తోంది. ఇదే సమయంలో బాలకిషన్ ఇంట్లో ఓ లేఖ రాసిపెట్టినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో కుటుంబంతో కలిసి ఇంటిని వదిలిపెడుతున్నట్లు పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు వ్యక్తుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణను ముమ్మరం చేశారు. ఐదుగురు వ్యక్తుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అనుమానాస్పద కోణాలపైనా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్, వారి ఆఖరి సంభాషణలు, బ్యాంకింగ్ డీటెయిల్స్ సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని ఏసీపీ మధు తెలిపారు. ఈ ఘటనకు పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా విచారణలో బయటపడుతున్న సంచలన విషయాలు