మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆమె మద్దతు ఇచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 10 వార్డులకు గాను 8 చోట్ల ఘనవిజయం సాధించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. “అక్క కేవలం మద్దతు ఇస్తేనే మున్సిపాలిటీ కైవసమైంది.. ఇక సొంతంగా పార్టీ పెడితే బ్యాలెట్ బాక్సులు బద్దలవ్వడం ఖాయం” అంటూ ఆమె అభిమానులు ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్రెండ్ చేస్తున్నారు.
Telangana: మంత్రులను అభినందించిన సీఎం
బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న కవితకు, వడ్డేపల్లి ఫలితాలు పెద్ద బూస్ట్ను ఇచ్చాయి. కేవలం ప్రచార పటంలో ఆమె ఫోటో మరియు మద్దతు ఉన్నందుకే ఓటర్లు ‘సింహం’ గుర్తుకు పట్టం కట్టడం ఆమెకున్న ప్రజాదరణకు నిదర్శనమని అనుచరులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ అవగాహన, వ్యూహరచనలో కవితకు ఉన్న పట్టు ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపితమైందని, అందుకే ఆమె ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. అయితే గెలిచిన కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరినప్పటికీ, ఓటర్లు మాత్రం కవిత నాయకత్వం వైపే మొగ్గు చూపారనేది ఇక్కడ గమనార్హం.

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చపై రాజకీయ ప్రత్యర్థులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా కేవలం కృత్రిమ ప్రచారమని కొందరు కొట్టిపారేస్తుంటే, కవిత అభిమానులు మాత్రం ఇది క్షేత్రస్థాయిలో ఉన్న నిశ్శబ్ద విప్లవమని వాదిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, కవిత కొత్త పార్టీ పెడితే అది బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. పరిపూర్ణమైన రాజకీయ అవగాహనతో ముందుకు సాగుతున్న కవిత, తన భవిష్యత్ కార్యాచరణను ఎప్పుడు ప్రకటిస్తారా అని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి నెలకొంది. మొత్తానికి “అక్క పార్టీ పెడితే బ్యాలెట్ బాక్సులు బద్దలే” అనే నినాదం ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com