తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే TG EAPCET (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 11న విడుదల చేశారు. ఈ ఫలితాలతో లక్షలాది మంది విద్యార్థులు తమ కలల విద్యారంగ ప్రవేశానికి ముందడుగు వేశారు.

విజేతలలో అబ్బాయిలదే హవా
ఇంజినీరింగ్ విభాగంలో 73.26 శాతం మంది, అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో 87.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విశేషంగా, ఈ ఏడాది రెండు విభాగాల్లోనూ అబ్బాయిలే అగ్రస్థానాల్లో నిలవడం గమనార్హం. ఇంజినీరింగ్లో తొలి 10 ర్యాంకుల్లో మొత్తం 10 ర్యాంకులు అబ్బాయిలవే కాగా, అగ్రికల్చర్ విభాగంలో మొదటి పదిలో 9 ర్యాంకులు అబ్బాయిలే సొంతం చేసుకున్నారు.
జూన్ చివర లేదా జులై మొదటి వారంలో ప్రారంభం?
విద్యాశాఖ వర్గాల సమాచారం మేరకు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశముందని తెలుస్తోంది. జూన్ 2న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ వెంటనే ఐఐటీలతో పాటు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ ప్రారంభమవుతాయి. కనీసం 4 విడతల జోసా కౌన్సెలింగ్ ముగిసిన తరువాతే ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇక్కడ చేరిన వారందరూ మళ్లీ జోసా కౌన్సెలింగ్లోకి వెళ్లిపోతారు. ఈక్రమంలో జూన్ నెలాఖరులో లేదా జులై మొదటి వారంలో ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభింస్తారు. ఆగస్టు మొదటి వారంలో ఇంజినీరింగ్ తరగతులను మొదలుపెట్టనున్నారు.
కాలేజీల్లో సీట్ల కోసం పోటీ
విద్యాశాఖ ప్రణాళక ప్రకారం, కౌన్సెలింగ్ తర్వాత ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, విద్యార్థులు తగిన ప్లానింగ్తో కౌన్సెలింగ్లో పాల్గొనాలి. ఇదే సమయంలో, పలు ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం పోటీ మొదలైంది. గత నెల రోజులుగా పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు యాజమాన్య స్థానాల వివరాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. తమ ర్యాంక్ ఆధారంగా కన్వీనర్ కోటా సీటు రావడం కష్టమని భావించే విద్యార్థులు, ఇప్పుడే యాజమాన్య కోటా సీట్లను లక్క్ష్యంగా పెట్టుకుంటున్నారు.
Read also: CA exams 2025 : వాయిదా పడిన సీఏ పరీక్షలు .. మే 16 నుంచి పునఃప్రారంభం