ఢిల్లీ పర్యటన(Delhi)లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) శుక్రవారం పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ–న్యూజెర్సీ మధ్య వ్యాపార, విద్యా, సాంకేతిక రంగాలలో సహకార అవకాశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఆ తరువాత ఉదయం 11:30 గంటలకు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్లో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఈ వేదికపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానాలు, పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు రాష్ట్రం అందించే అవకాశాలపై ఆయన వివరిస్తారని అంచనా. తెలంగాణను పెట్టుబడులకు అగ్రగామి రాష్ట్రంగా నిలపడం లక్ష్యంగా ఆయన ప్రసంగం ఉండనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కార్ల్స్బర్గ్, గోద్రెజ్, ఉబర్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ(Telangana)లో పెట్టుబడులు, ఉద్యోగ సృష్టి, కొత్త ప్రాజెక్టుల స్థాపనపై చర్చలు జరగనున్నాయి. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ఆయన ప్రత్యేక భేటీ అవుతారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణను గ్లోబల్ స్థాయిలో పెట్టుబడిదారుల దృష్టికి తీసుకువెళ్లే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.