తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సాంప్రదాయ ఉత్సవం బతుకమ్మ పండుగ(Bathukamma). పూలతో అలంకరించిన బతుకమ్మను ఆడపిల్లలు, మహిళలు గుంపులుగా చేరి పాటలు పాడుతూ ఆడిపాడుతూ జరుపుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli ) మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ప్రకృతిని గౌరవించడం, కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతాయని ప్రకటించారు. వరంగల్లోని వెయ్యి స్తంభాల ఆలయం వద్ద ప్రారంభోత్సవం జరిపి, గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు.

హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం సహా రాష్ట్రంలోని ప్రతి పట్టణం, గ్రామంలో బతుకమ్మ పండుగ ఆత్మీయంగా జరగాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పండుగ చివర్లో బతుకమ్మలను చెరువుల్లో వదిలే విధంగా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. బతుకమ్మ చరిత్ర, సంప్రదాయాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి, కొత్త కవులు, రచయితలతో బతుకమ్మ పాటలు సృష్టించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ పండుగ వ్యక్తిగతం కాదు, సమాజం మొత్తం కలిసి జరుపుకునే పండుగ అని, అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అయితే బతుకమ్మ పండుగను కొందరు రాజకీయరంగంలోకి లాగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయం, ఇది ఏ ఒక్క పార్టీకి పరిమితం కాని ప్రజల పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి చివరి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ముందుకు వెళ్లాలని సూచించారు. బతుకమ్మ కుంటలను పునరుద్ధరించడం ద్వారా పండుగ మరింత అందంగా జరగడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా కలిసి జరుపుకోవడమే బతుకమ్మ పండుగ యొక్క అసలు ఉద్దేశమని ఆయన హితవు పలికారు.