తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో నెలకొనే విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. ముఖ్యంగా రాబోయే మూడు సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్ ఎలా ఉండబోతుందో అంచనా వేసి, ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో అధికారులు సీఎం రేవంత్కు వివరించిన మేరకు ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ‘గత ఏడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది. 2025- 26లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుంది. 2034-35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుంది. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
భవిష్యత్తు ప్రాజెక్టులకు విద్యుత్ అవసరం
విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాల ను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి అని సీఎం రేవంత్ అధికారులతో పేర్కొన్నారు.
భూగర్భ విద్యుత్ లైన్లు – ఫ్యూచర్ సిటీ ప్రత్యేకత
విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు. హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. పూర్తిగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు.
స్మార్ట్ పోల్స్, సోలార్ విద్యుత్ పై దృష్టి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలి. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలా ల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి అని సీఎం రేవంత్ అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. అభివృద్ధి ప్రాధాన్యం పొందుతున్న తెలంగాణలో, ఆధునిక మౌలిక సదుపాయాలు, భవిష్యత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా రూపొందించేందుకు ఇది కీలక దిశగా మారనుంది.
Read also: Konda Surekha: మంత్రుల పని తీరుపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్