తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) ఈసారి కడపలో ఘనంగా నిర్వహించారు. సభలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర అభివృద్ధిపై తమ దృష్టికోణాన్ని వివరించారు. రాష్ట్రం కోసం వారి ప్రణాళికలు వినిపించి, పలు అంశాలపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.విద్యుత్ రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. 2014–19లో ఆంధ్రప్రదేశ్ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుది అని గుర్తుచేశారు. గత ప్రభుత్వం 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.1.29 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. గ్రీన్ ఎనర్జీపై కూటమి ప్రత్యేక దృష్టి పెట్టి, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం పెట్టుకున్నదని వివరించారు.నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఎన్టీఆర్ నుంచీ చంద్రబాబు (Chandrababu) వరకూ నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పోలవరం 72% పూర్తయిందని, కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 2027 చివరికి పోలవరం పూర్తి చేసి, రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీరందించడమే లక్ష్యమన్నారు.

హంద్రీనీవాకు రూ.3,800 కోట్లు – రాయలసీమకు చైతన్యం
రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రైతులకు టీడీపీ మాత్రమే భరోసా అని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు మొదటి ఏడాదిలోనే భారీ నిధులు కేటాయించామని తెలిపారు. పోలవరం-బనకచర్ల అనుసంధానంతో రాయలసీమ సస్యశ్యామలమవుతుందని తెలిపారు.మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రజలు అక్రమ కేసుల బాధ అనుభవించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కొత్త చట్టాలు తీసుకువచ్చిందని, గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని వివరించారు.టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాజమండ్రి మహానాడు నుంచే సంక్షేమ విప్లవానికి నాంది పలికామని తెలిపారు. దీపం–2, తల్లివందనం, అన్నదాత సుఖీభవ పథకాలు త్వరలో అమలవుతాయని వివరించారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, యువత కోసం నెలకు ₹3,000 భృతి, 20 లక్షల ఉద్యోగాలు వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
అమరావతి భవిష్యత్పై ధీమా – సోమిరెడ్డి
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం అయ్యాక శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. అమరావతికి 500 ఎకరాలు చాలంటూ జగన్ తీసుకున్న నిర్ణయం రాజధాని భావనను ధ్వంసం చేసిందని విమర్శించారు.ఎంపీ భరత్ మాట్లాడుతూ, గండికోట, అరకు వంటి ప్రాంతాలను పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. పర్యాటకం ద్వారా 2 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని వెల్లడించారు.
యోగా, ఆరోగ్యంపై టీడీపీ దృష్టి
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, రాజకీయ సభల్లో యోగాపై తీర్మానం అరుదని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. జూన్ 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపనున్నట్లు చెప్పారు.టీడీపీ సేవాసంస్థగా మారిందని మాజీ చైర్మన్ షరీఫ్ చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిందని, ఇప్పుడు కూటమి మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తోందన్నారు.