ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతుండగా, తాజాగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో వీటి అమలు కోసం నిధుల కేటాయింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.2024లో ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 24న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 28న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సూపర్ సిక్స్ హామీలు – బడ్జెట్ కేటాయింపులు
ఈ బడ్జెట్లో ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి హామీల అమలుకు నిధుల కేటాయింపుపై దృష్టి సారించనున్నారు. జూన్లో తల్లికి వందనం, జూలైలో అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తల్లికి వందనం పథకం:
ఈ పథకం కింద ప్రతి తల్లికి రూ. 15,000 చొప్పున ప్రభుత్వం నేరుగా ఖాతాలో జమ చేయనుంది.తాజా లెక్కల ప్రకారం 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తింపు పొందారు.దీనికి కావాల్సిన మొత్తం రూ. 10,300 కోట్లు అవసరమని తేల్చారు.అర్హతల ఖరారు ఇంకా కొనసాగుతోంది.

అన్నదాత సుఖీభవ పథకం:
ప్రతీ రైతుకు ఏటా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ 20 వేలు ఇచ్చేలా హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా గుర్తించారు. ఒక్కో రైతుకు రూ 20 వేలు చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం రూ 10,717 కోట్లు.పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయింపు చేయనున్నారు. ఈ లెక్కన ఒక్కో రైతుకు ఏడాదికి రూ 14 వేలు చొప్పున చెల్లిస్తే కావాల్సిన మొత్తం 7,502 కోట్లు కావాలని తేల్చారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. నిరుద్యోగ భృతి పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది స్పష్టత రావాల్సి ఉంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉగాది నుంచి అమలు చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ, ఇప్పుడు ఈ పథకం అమలు లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.