ఇజ్రాయెల్, ఇరాన్(Israel, Iran) మధ్య పరస్పర దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్(Israelపై 100 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 60 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులకు గాయాలు కాగా, పలు భవనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇరాన్పై చేస్తున్న దాడుల్లో కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.

సురక్షిత ప్రాంతానికి అలీ ఖమేనీ తరలింపు
ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈశాన్య టెహ్రాన్లోని అండర్గ్రౌండ్ బంకర్లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత శుక్రవారం ఖమేనీ నివాసం సమీపంలో ఇజ్రాయెల్ వైమానికి దాడులు జరిపింది. ఆదివారం కూడా ఈ ప్రాంతంలోనే మరోసారి పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ఖమేనీని వెంటనే లావిజాన్లోని బంకర్కు ఆయనను తరలించినట్లు సదరు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. కాగా, గతేడాది ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలోనూ ఖమేనీ కుటుంబం బంకర్లోకి వెళ్లిన సందర్భాలున్నాయి.
14 మంది ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు మృతి
ఇదిలా ఉండగా, సోమవారం తెల్లవారుజామున ఫోర్దో న్యూక్లియర్ సైట్ వద్ద భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో స్వల్ప భూకంపం సంభవించినట్లు సమాచారం. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 14 మంది ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు మరణించారు. గత నాలుగు రోజుల నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్కు భారీగానే నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి మరణించగా, తాజాగా ఈ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమీ, ఆయన డిప్యూటీ జనరల్ హసన్ మహాకిక్ కూడా మృతిచెందారు. ఈ విషయాన్ని నెతన్యాహు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Read Also: America:ఫేక్ గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా ఫోకస్