హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె కు సైరన్ మోగించనున్నారు . ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం TSRTC ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో RTC MDకి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 4 గంటలకు బస్భవన్లో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేయనున్నట్టు జేఏసీ చైర్మన్ ఈ వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో-కన్వీనర్లు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నర్న విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారం చెయ్యాలని.. EV బస్సుల రాకతో బస్ డిపో లు ఖాళీ చేస్తున్నారు RTC ఉద్యోగులు. ఇప్పటికే రెండు డిపోలను విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి… ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. పనిభారం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సమ్మె తప్ప మరో మార్గం కనిపించడం లేదని జేఏసీ నేతలు వెల్లడించారు. ఆర్టీసీ ఎండీకి సోమవారం మధ్యాహ్నం సమ్మె నోటీసులు ఇవ్వనున్న నేతలు సానుకూల నిర్ణయం రాకపోతే మార్చి మొదటి వారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ‘‘ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలి. ప్రభుత్వానికి ఆర్టీసీపై ప్రేమ ఉంటే 5 వేల కోట్లు కేటాయించాలి. ఈవీ బస్సుల్ని స్వాగతిస్తున్నాం.. కానీ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవే అంశాలపై సోమవారం సమ్మె నోటీసు ఇస్తున్నాం’’ అని జేఏసీ ఛైర్మన్ వెంకన్న తెలిపారు. కాగా, కార్మికుల సమస్యలపై చర్చలు జరుపుతామని, ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.