ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే హాల్ టికెట్లను జారీ చేసింది. విద్యార్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమంతోపాటు, తొలిసారిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు మొత్తం 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల ప్రత్యేక ఏర్పాట్లు:
రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 5,64,064 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో, 51,069 మంది విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 30,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు (అన్ని ప్రధాన పేపర్లు) ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ పేపర్లకు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ కోసం 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. విద్యార్థులకు 24 పేజీల జవాబు బుక్లెట్ ఇవ్వనున్నారు. అదనంగా కావాలంటే మరో 12 పేజీల బుక్లెట్ కూడా అందుబాటులో ఉంటుంది.
సిలబస్, మార్పులు
2020-21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమానికి మార్చింది.
6వ తరగతి నుంచే ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేయడంతో, ఇప్పుడు పదో తరగతికి వచ్చిన విద్యార్థులు తొలిసారిగా ఈ సిలబస్లో పరీక్షలు రాస్తున్నారు. సీబీఎస్ఈ తరహాలో 20% ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. అయితే, ఈ సంవత్సరం వంద మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 20% ఇంటర్నల్ మార్కులు అమల్లోకి రానున్నాయి. సీబీఎస్ఈ బోర్డులో ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉండగా, రాష్ట్రంలో విద్యార్థులు ఆరు సబ్జెక్టులు చదువుతున్నారు. పరీక్షకు కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. బ్లాక్ లేదా బ్లూ బాల్పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు అనుమతించరు. ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే ముందు అన్ని నియమాలను పాటించి, విజయవంతంగా పరీక్ష రాయాలని అధికారులు సూచించారు.