ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి ఓటమిని చవి చూసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచిన ఆర్సీబీ, తమ హోమ్ గ్రౌండ్లో మాత్రం విజయం సాధించలేకపోయింది. 169 పరుగుల స్కోర్ను కాపాడుకోలేక, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 13 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఈ మ్యాచ్లో బెంగళూరు టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7), దేవదత్ పడిక్కల్ (4), రజత్ పటిదార్ (12) పరుగులతో నిరాశపరిచారు. 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ ఒత్తిడిలో పడింది. మిడిలార్డర్లో లియామ్ లివింగ్స్టన్ (54), వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ (33) మాత్రమే కొంత మెరుగైన ప్రదర్శన చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ భారీ షాట్లు బాదడంతో 169 పరుగుల స్కోర్ను చేరుకోగలిగింది.
బౌలింగ్ విఫలమవడం
169 పరుగుల స్కోర్ పోరాడదగినదే. అయితే, బెంగళూరు బౌలర్లు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. గుజరాత్ బ్యాటర్లను ఒత్తిడిలో పెట్టలేకపోయారు. ముఖ్యంగా జోస్ బట్లర్ను కట్టడి చేయలేకపోయారు. బౌలింగ్ విభాగంలో అనుభవజ్ఞులు అయిన భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, యష్ దయాళ్ ఉన్నప్పటికీ, గుజరాత్ బ్యాటింగ్ లైనప్ను ఛేదించలేకపోయారు. హేజిల్వుడ్ ఈ మ్యాచ్లో అత్యంత దారుణంగా ప్రదర్శన కనబరిచాడు. 3.5 ఓవర్లలో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సులు వచ్చాయి. దీనితో పాటు భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగలిగాడు.