గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు, భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో న్యూజిలాండ్ను కేవలం 159 పరుగులకే ఆలౌట్ చేసి, భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
కివీస్ బ్యాటర్లను వణికించిన భారత బౌలర్లు
భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభం నుంచే తడబడింది. సెమీఫైనల్ హీరో ఫిన్ అలెన్ (9)ను అక్షర్ పటేల్ త్వరగానే పెవిలియన్ పంపగా, రచిన్ రవీంద్ర (1), గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్మన్ (3) వరుసగా వికెట్లు పారేసుకున్నారు. దీంతో 47 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ పక్క వికెట్లు పడుతున్నా టిమ్ సీఫెర్ట్ (52) మెరుపు దాడి చేస్తూ భారత్ను భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, వరుణ్ చక్రవర్తి అతడిని అవుట్ చేసి కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్ చాపచుట్టేయడంతో భారత్ ఘనవిజయం ఖాయమైంది.
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. ముచ్చటగా మూడోసారి!
ఈ విజయంతో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు (Back-to-Back) టైటిల్ నెగ్గిన జట్టుగా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో ఛాంపియన్గా నిలిచిన భారత్, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టైటిల్ను నిలబెట్టుకుంది. మొత్తంగా భారత్కు ఇది మూడో టీ20 ప్రపంచకప్ (2007, 2024, 2026). ధోనీ, రోహిత్ తర్వాత ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :