తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 27 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు కాగా ,స్కూళ్లు తిరిగి జూన్ 12న ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోనూ పాఠశాలలకు భారీగానే వేసవి సెలవులు ఉండనున్నాయి.ఈ రెండూ రాష్ట్రాల విద్యార్థులకు వేసవి సెలవులు గణనీయంగా ఉండబోతున్నాయి.గత సంవత్సరం వడగాడ్పులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఈ ఏడాది కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో వేసవి సెలవుల తేదీల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇంకా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ఒకటి లేదా రెండు రోజుల్లో పాఠశాలల వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఏపీ ఇంటర్ విద్యలో మార్పులు
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థలో కొన్ని కీలక మార్పులను అమలు చేయనుంది. ఇప్పటివరకు ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం, ఈ ఏడాది నుంచిఏప్రిల్ 1న ప్రారంభమయ్యే అవకాశముంది. దీనికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ సిద్దం చేసినట్లు సమాచారం.ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమవుతాయని, క్లాసులు ఏప్రిల్ 24 నుంచి మొదలవుతాయని సంబంధిత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో విద్యార్థులకు కొత్త షెడ్యూల్ ఉండబోతుంది. మే నెలాఖరు వరకు వేసవి సెలవులు కొనసాగి, జూన్ 2న తిరిగి తరగతులు ప్రారంభం కానున్నాయి.
విద్యా సంవత్సరం
ఈసారి మొత్తం 235 రోజులు తరగతులు జరగనున్నట్లు సమాచారం. అదేవిధంగా, వేసవి సెలవులు కాకుండా విద్యార్థులకు మొత్తం 79 హాలిడేలు ఉంటాయని కూడా పేర్కొంటున్నారు. సాధారణంగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏడాది విద్యా సంవత్సరం మే లేదా జూన్ మధ్య ముగుస్తుంది.

కొత్త షెడ్యూల్
ఈ మార్పులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు కొత్త షెడ్యూల్కి అలవాటు పడాల్సి ఉంటుంది. మే నెలాఖరు వరకూ సెలవులు ఇచ్చినప్పటికీ, జూన్ 2 నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయి.ఇదిలా ఉండగా, తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.
అధికారిక ప్రకటన
ఈ మార్పులపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యార్థులు వారి వార్షిక విద్యా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పాఠశాలలు, ఇంటర్ విద్యా సంస్థల షెడ్యూల్ మార్పులతో విద్యార్థులు ముందుగా ప్రణాళికలు వేసుకోవడం మంచిది.