భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈసారి భారత గగనయాత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందడమే కాకుండా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ (ISS) నుంచి ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యక్షంగా సంభాషించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది.శనివారం దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం అయిన ఈ కార్యక్రమంలో అంతరిక్షం నుంచి భారతదేశాన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతిని శుక్లా పంచుకున్నారు. “అంతరిక్షం నుంచి భారతదేశాన్ని చూసినప్పుడు, అది పటాల్లో కనిపించే దానికంటే ఎంతో విశాలంగా, చాలా పెద్దదిగా అనిపించింది” అని ఆయన అన్నారు.
ప్రధాని మాటలకు శుక్లా స్పందిస్తూ
ఈ సందర్భంగా వ్యోమగామి శుక్లాను ప్రధాని మోదీ అభినందించారు. “మీ పేరులోనే ‘శుభ్’ ఉంది. మీ ఈ యాత్ర భారతదేశానికి ఒక నూతన శకానికి ‘శుభారంభం’. ఈ క్షణంలో 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు మీతో ముడిపడి ఉన్నాయి. నేను కేవలం ప్రధానిగా కాకుండా ప్రతి భారతీయుడి గర్వానికి, ఆశలకు ప్రతినిధిగా మీతో మాట్లాడుతున్నాను” అని మోదీ భావోద్వేగంగా అన్నారు.ప్రధాని మాటలకు శుక్లా స్పందిస్తూ, “ప్రధానమంత్రి గారూ, నేను ఇక్కడ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాను. భారతదేశానికి (India) ఇది ఒక కొత్త శకం మొదలైనట్లే. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞుడను. ఎప్పటికైనా అంతరిక్షంలోకి వెళ్తానని నేను ఊహించలేదు. కానీ మీ నాయకత్వంలో భారతదేశం కలలు కనడం నేర్చుకుంది. వాటిని నిజం చేసుకునే ధైర్యాన్ని కూడా పొందింది” అని తెలిపారు.

కేవలం రుచి కోసం కాదు
ఈ చారిత్రక ప్రయాణంలో శుభాంశు శుక్లా తన వెంట భారతీయ సంప్రదాయ రుచులైన ‘గాజర్ కా హల్వా’, ‘ఆమ్రస్’ (మామిడి గుజ్జు) తీసుకెళ్లడం విశేషం. “నేను నాతో పాటు గాజర్ కా హల్వా, ఆమ్రస్ తీసుకొచ్చాను. ఇవి కేవలం రుచి కోసం కాదు. ఇంటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక భాగం” అని శుక్లా నవ్వుతూ చెప్పారు. తన సహ వ్యోమగాములైన పెగ్గీ విట్సన్ (అమెరికా), సావోస్జ్ ఉజ్నాన్స్కి (పోలాండ్), టిబోర్ కపు (హంగేరీ)లకు భారతీయ ఆతిథ్యాన్ని రుచి చూపించారు. అంతరిక్షంలో శుభాంశు (Shubhanshu Shukla) తీసుకెళ్లిన భారతీయ వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు, మన సంస్కృతి, జ్ఞాపకాలు, భావోద్వేగాలు, భారతీయతకు ప్రతిరూపం. ఇంటి నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, శుభాంశు మన దేశ మూలాల్ని గుండెల్లో పెట్టుకొని వెళ్లారు. ఇది ఒక భారతీయుడిగా ప్రతి మనిషికి గర్వకారణం
Read Also: Parag Jain : జులై 1న రా చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న పరాగ్ జైన్