ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా 88 మందికి భారీ ఊరట లభించింది. అప్పట్లో టీడీపీ ఆఫీసుపై దాడి చేశారంటూ వల్లభనేని వంశీతో పాటు మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుందని భావిస్తున్న తరుణంలో ఫిర్యాదు దారు అయిన టీడీపీ ఆఫీసు ఆపరేటర్ సత్యవర్ధన్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు.

అప్పట్లో గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై వల్లభనేని వంశీ ప్రోత్సాహంతో విజయవాడ నుంచి వచ్చిన వైసీపీ నేతలతో పాటు స్థానిక నేతలు కూడా దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై అట్రాసిటీ కేసు సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ దెబ్బకు వంశీ అమెరికాకు వెళ్లినపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మిగతా నిందితులు మాత్రం కోర్టు విచారణలకు హాజరవుతున్నారు. ఈ తరుణంలో కేసు యూటర్న్ తీసుకుంది. ఈ కేసులో అప్పట్లో వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసిన గన్నవరం టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో తనను సాక్షిగా పెట్టి కేసు నమోదు చేశారని, సంతకం తీసుకున్నారని ఆయన నేరుగా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ వద్దకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. తనకూ ఈ కేసుతో సంబంధం లేదని తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో బెయిలు కోసం కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, బెయిలు కోసం కింది కోర్టునే ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వారు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ ప్రారంభమైంది. అసలు ఆ దాడి జరిగినప్పుడు తాను అక్కడ లేనని కూడా సత్యవర్ధన్ తేల్చేశారు. దీంతో పాటు తనకు పోలీసుల రక్షణ కల్పించాలని, ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ లేనని న్యాయాధికారి హిమబిందుకు వివరిస్తూ తన వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసి తీసుకొచ్చిన సీడీతోపాటు అఫిడవిట్ అందజేశారు. ఈ కేసులో పోలీసులు తనను సాక్షిగా పిలిచి సంతకం తీసుకున్నారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో విచారణను కోర్టు నేటికి (మంగళవారం) వాయిదా వేసింది. దీంతో ఇవాళ కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది.
మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ హయాంలో దాడి జరిగినా అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు కీలక నిందితుల్ని మాత్రం అరెస్టు చేయలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కాగా ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కావడం తథ్యమని టీడీపీ నేతలు భావించారు. కానీ ఇప్పుడు ఫిర్యాదు దారే యూటర్న్ తీసుకోవడంతో వంశీ సహా 88 మంది బయటపడే అవకాశం ఉంది. అదే సమయలో టీడీపీకి భారీ షాక్ తప్పడం లేదు.