ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇటీవల వైఎస్సార్ జిల్లా పేరును తిరిగి “వైఎస్సార్ కడప జిల్లా గా మార్చింది. అదే సమయంలో కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ నుంచి “వైఎస్సార్” పేరును తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు “అత్త మీద కోపం, దుత్త మీద చూపినట్లు” ఉందని ఆమె విమర్శించారు.
ఎన్టీఆర్ పేరు మార్పు
జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉండగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్సార్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని తెలిపారు.
వైఎస్సార్ అంటే ఎందుకింత కక్ష
వైఎస్సార్ జిల్లాను తిరిగి వైఎస్సార్ కడప జిల్లా గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమకు అభ్యంతరం లేదని షర్మిల అన్నారు. అయితే, కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ నుండి వైఎస్సార్ పేరు తొలగించడం పూర్తిగా అనుచితమని, దానిని ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. “వైఎస్సార్ అంటే ఎందుకింత కక్ష?” అని ప్రశ్నించారు.ఇక, వైఎస్సార్ జిల్లాలో కడప పేరును చేర్చినప్పుడు, విజయవాడ కేంద్రంగా ఉన్న “ఎన్టీఆర్ జిల్లా”కు “ఎన్టీఆర్ విజయవాడ” అని లేదా పాత కృష్ణా జిల్లాకు “ఎన్టీఆర్ కృష్ణా జిల్లా”గా ఎందుకు పేరు మార్చలేదు? అంటూ షర్మిల ప్రశ్నించారు.

మహానేత
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత వైఎస్సార్. తెలుగు వారు తమ గుండెల్లో గుడి కట్టుకొని, ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్సార్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదు. వైఎస్సార్ అనే పేరు ప్రజల ఆస్తి. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు. వైఎస్సార్ తెలుగు వారి సొత్తు” అని షర్మిల స్పష్టం చేశారు.
షర్మిల వ్యాఖ్యలు
వైఎస్సార్ తెలుగు ప్రజల ఆస్తి – ఆయన పేరు ఎవరూ చెరిపేయలేరు” అంటూ షర్మిల వ్యాఖ్యలు చెశారు.