Schengen Visa: ఇండియన్స్ కి షెంజెన్ వీసాల తిరస్కరణ

Read Time:  1 min
Schengen Visa: ఇండియన్స్ కి షెంజెన్ వీసాల తిరస్కరణ
FONT SIZE
GET APP

యూరప్ టూర్ల కలకు షాక్‌: భారత్‌ షెంజెన్‌ వీసా తిరస్కరణల్లో మూడో స్థానంలో

లక్షల్లో తిరస్కరణలు – కోట్లలో నష్టం

ప్రతి ఏడాది యూరప్ పర్యటనకు లక్షలాది మంది పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్ధులు, పరిశోధకులు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో షెంజెన్ వీసా (Schengen Visa) అనేది ప్రధాన గమ్యం. షెంజెన్ వీసా ఒకసారి వచ్చిందంటే, 29 ఐరోపా దేశాల్లో స్వేచ్ఛగా తిరగొచ్చే వీలుండటం వల్ల దానికో ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ వీసా దరఖాస్తులపై తిరస్కరణల రేటు పెరుగుతోంది. ఇది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

దరఖాస్తుల తిరస్కరణ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తద్వారా భారతీయ దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు నష్టపోయారు. యూరోపియన్ కమిషన్ (European Commission) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

షెంజెన్ సభ్యదేశాలకు గత ఏడాది వచ్చిన మొత్తం వీసా దరఖాస్తుల్లో 17 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు కాండ్ నాస్ట్ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ దరఖాస్తు రుసుముల ద్వారా రూ.1,410 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా.

Schengen Visa: ఇండియన్స్ కి షెంజెన్ వీసాల తిరస్కరణ

పెరిగిన ఫీజు.. పెరిగిన నిరాకరణలు

గతేడాది జూన్‌లో షెంజెన్ వీసా రుసుము 80 యూరోల నుంచి 90 యూరోల‌కు పెరిగింది. దీన్ని సగటున 85 యూరోలుగా పరిగణిస్తే, ఒక్క నిరాకరించిన దరఖాస్తుకి దాదాపు రూ.8,200 ఖర్చవుతోంది. దీంతో 1.65 లక్షల భారతీయ దరఖాస్తుదారులు మొత్తం రూ.136 కోట్లు నష్టపోయారు. వీసా దరఖాస్తు తిరస్కరించబడినప్పటికీ, రుసుము వెనక్కి రాదు. దీంతో ఈ వ్యవస్థ పట్ల దరఖాస్తుదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది.

అనుమానాస్పద దరఖాస్తులపై ఖచ్చితంగా నిర్ణయం

ఈ వీసా తిరస్కరణల వెనుక పలు కారణాలు ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో భారతీయ దరఖాస్తులను అనుమానాస్పదంగా పరిగణించి తిరస్కరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తప్పుడు సమాచారం, సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం, ప్రయాణ ఉద్దేశ్యం స్పష్టంగా తెలియకపోవడం వంటి అంశాలు తిరస్కరణకు దారితీస్తున్నాయి. అంతేకాదు, కొన్ని దేశాలు భారత్‌ను “హై రిస్క్” జోన్‌గా పరిగణిస్తూ మరింత జాగ్రత్తగా దరఖాస్తులను పరిశీలిస్తున్నాయి.

వీసా విధానాల్లో పారదర్శకత అవసరం

వీసా తిరస్కరణల విషయంలో పారదర్శకత లేకపోవడం, దరఖాస్తుదారులకు స్పష్టమైన కారణాలు తెలియకపోవడం, ఫిర్యాదు చేసే విధానం క్లిష్టంగా ఉండటం వంటివి కూడా ప్రజల ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా యూరోపియన్ యూనియన్ దేశాలతో డిప్లొమాటిక్ స్థాయిలో చర్చలు జరిపే అవసరం ఉంది. అలాగే, ప్రయాణికులు కూడా వీసా దరఖాస్తు చేసేముందు సరైన సమాచారం, డాక్యుమెంటేషన్‌ను సిద్ధం చేసుకోవడం, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం.

Read also: Germany : జర్మనీలోని హామ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన

Ramya

రచయిత గురించి

Ramya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.