సరిహద్దుల్లో పహారా కాచే సైన్యం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలంటే కాలి నడకను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి దేశంలో చొరబడాలని ప్రయత్నించే పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇలాంటప్పుడు మన సైన్యాన్ని సాంకేతికంగా మరింత బలోపేతం చేసి, ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశలో భారత ప్రభుత్వం “ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ (ATVs)”ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దాని ప్రత్యేకతలేంటి?
ఆల్ టెర్రయిన్ వెహికిల్ అంటే.. ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా సరే దూసుకెళ్లే వాహనం అని అర్థం. అంటే కొండలు, లోయలు, ఎడారి ఇసుక నేలలు, అడవులు, రాళ్లు రప్పలతో కూడిన వాగులు, మంచుతో కప్పేసిన మార్గాలు.. ఇలా ఎక్కడైనా సరే ఆ వాహనంలో ప్రయాణం చేయవచ్చు. ఇవి సరిహద్దులను కాపుకాసే సైన్యానికి చాలా అవసరం. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో “లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC)”, టిబెట్ (చైనా) సరిహద్దుల్లోని “లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)” వద్ద వీటి అవసరం ఎక్కువగా ఉంది. పూర్తిగా సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో LoC, LAC ఉన్నాయి. ఇక్కడ కాపలా కాయడం అంటే కత్తి మీద సాములాంటి వ్యవహారమే. సరిహద్దుల్లో సైన్యం కాపలాగా ఉండే వాచ్ టవర్ల నుంచి తమ యూనిట్లకు చేరుకోవాలన్నా.. యూనిట్ నుంచి మరో బృందం వాచ్ టవర్ వద్దకు చేరుకోవాలన్నా కాలి నడక సాగించాల్సిందే. ఇలాంటి చోట ఇప్పుడు ATVలను వినియోగించనున్నారు.
టిబెట్ (చైనా) సరిహద్దులపై ప్రత్యేక దృష్టి
గల్వాన్ సంఘటన తర్వాత టిబెట్ (చైనా) సరిహద్దులపై ప్రత్యేక దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం.. ఇక్కడి సైన్యం కోసం 3 రకాల ఆల్ టెర్రయిన్ వెహికిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోలారిస్ స్పోర్ట్స్మ్యాన్ విత్ క్యాబ్, పోలారిస్ RZR, JSW-గెక్కో ATOR వంటి ATVలను లడఖ్లో మోహరించింది. లద్దాఖ్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన క్లిష్టమైన భౌగోళిక ప్రాంతం. ఇక్కడి అతిశీతల వాతావరణం, మంచుతో పాటు ఎగుడుదిగుడుగా.. హిమాలయ పర్వతాల మధ్య పీఠభూమి, లోయలు, ఎత్తైనా శిఖరాలతో కూడుకుని ఉంటుంది. ఇలాంటి చోట సైన్యం వేగంగా ఒకచోట నుంచి మరో చొటకు కదలాలి అంటే కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిని తాజాగా ప్రవేశపెట్టిన ఆల్ టెర్రయిన్ వెహికిళ్లు నివారించగల్గుతాయి.