ఉక్రెయిన్ – రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ మరోసారి శాంతి సూచన చేశారు. ఈనెల 15న తుర్కియేలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. “ఈ యుద్ధాన్ని ఇక ముగించాల్సిన సమయం వచ్చింది. చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది,” అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.
రష్యా నుంచి స్పష్టత
“ఎలాంటి షరతులు లేకుండానే సీజ్ఫైర్ అమలుపరచాలి. అది మా ప్రాధాన్య ప్రతిపాదన. దీనిపై రష్యా నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాం,” అంటూ ఆయన ట్వీట్ చేశారు. తుర్కియే వేదికగా పుతిన్తో ప్రత్యక్ష చర్చలకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్చలు గతంలో కూడా జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఎలాంటి ఆలస్యం, సాకులు లేకుండా ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
జెలెన్ ప్రకటన తీవ్ర చర్చ
జెలెన్ స్కీ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. రష్యా యుద్ధ వైఖరిని మారుస్తుందా? శాంతికి పుతిన్ స్పందిస్తారా? అనే ప్రశ్నలు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలు ఈ యుద్ధానికి ముగింపు అవసరమని కోరుతున్న నేపథ్యంలో, తుర్కియేలో జరగబోయే చర్చలు కీలకంగా మారనున్నాయి.
Read Also : India – Pakistan War : భారత్ పై ప్రతీకారం తీర్చుకున్నాం -పాక్ ISPR DG