हिन्दी | Epaper

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

Sharanya
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లిఖితపూర్వక లేఖ పంపారు. ఈ లేఖలో ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో అక్రమంగా నివాసముంటున్న వలసదారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఉన్నవారి వల్ల భవిష్యత్తులో రాష్ట్ర భద్రతకు ముప్పు తలెత్తే అవకాశం ఉందని రాజాసింగ్(Raja Singh) హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతలు నిలుపుకోవాలంటే ముందుగా ఈ అక్రమ వలసదారుల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

హైదరాబాద్‌లో వలసదారులపై చర్చ

అక్రమ వలసదారులను గుర్తించి వీలైనంత త్వరగా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో రాజాసింగ్ రేవంత్ రెడ్డిని కోరారు. అక్రమ వలసదారులను ఇప్పుడే వెళ్లగొట్టాలని అలా అయితేనే తెలంగాణను కాపాడుకోగలుగుతామని సూచించారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డిని రాజాసింగ్ కోరారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తత

మరోవైపు భారత్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్‌లైన సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో భారీగా భద్రతను పెంచారు. సీసీ కెమెరాల సంఖ్యను పెంచి ప్రతి ఒక్కరి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను మూసి వేశారు. దీంతో రైల్వేస్టేషన్లకు ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు. అలాగే ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

డ్రోన్లపై నిషేధం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించడం ద్వారా మరో ముందస్తు చర్య చేపట్టారు. శంషాబాద్ ఎయిర్‍పోర్టుకు పది కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి శనివారం వెల్లడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం జూన్‌ 9 వరకు అమల్లో ఉండనుంది. శాంతిభద్రతల దృష్ట్యా హైదరాబాద్‌, సికింద్రాబాద్ నగరాల్లో టపాసుల కాల్చడాన్ని పోలీసులు నిషేధించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సహకరించాలని బహిరంగ ప్రదేశాల్లో, కంటోన్మెంట్ ప్రాంతాల్లో టపాసులు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఈ చర్యలు ప్రజల భద్రత కోసం తీసుకున్నవని పేర్కొన్నారు.

Read also: Operation Sindoor: పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు :అసదుద్దీన్ ఒవైసీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870