పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (operation sindoor) అంశంపై కాంగ్రెస్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul) కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. భారత్ తన దాడుల గురించి పాకిస్తాన్కు ముందుగానే ఎలా సమాచారం ఇచ్చిందని ప్రశ్నించారు. ఇది జాతీయ భద్రతను ప్రమాదంలో పెట్టే చర్యగా అభివర్ణించారు రాహుల్. ఇలాంటి సమాచారాన్ని ముందే పంచుకోవడం వల్ల ఆపరేషన్ ప్రభావం తక్కువై ఉండవచ్చని, ఇది నేరంగా పరిగణించాల్సిన విషయమని పేర్కొన్నారు.
సిందూర్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం పాకిస్తాన్కు సమాచారం
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం పాకిస్తాన్కు సమాచారం ఇచ్చిందని జైశంకర్ స్వయంగా చెప్పడం గంభీరమైన విషయం అని అన్నారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ జైశంకర్ చేసిన వీడియో క్లిప్ను రాహుల్ ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో షేర్ చేశారు. భారత్ ఉగ్రవాద స్థావరాలపై దాడికి దిగబోతోందని చెప్పడం వల్ల, ఆపరేషన్లో భారత వాయుసేనకు నష్టం వాటిల్లిందని, ఎంతమంది ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసం అయ్యాయో ప్రజలకు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఉగ్రవాద స్థావరాలపై దాడి
రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారం లీక్ చేయాలని ఎవరు ఆదేశించారో తేల్చాలన్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తామన్న సమాచారాన్ని ముందుగానే ఇచ్చే తీరును తప్పుపడుతూ, ఇది దేశ భద్రతను విస్మరించిన చర్య అని విమర్శించారు. జైశంకర్ వ్యాఖ్యల ప్రకారం, “మేము సైన్యంపై కాదు.. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నాం, కాబట్టి పాక్ మిలటరీ స్పందించకూడదని ముందుగానే చెప్పాం” అని చెప్పడాన్ని రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. మొత్తం మీద, ఈ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగుతోంది.
Read Also : Nara Lokesh : ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ