ములుగు జిల్లా గోవిందరావుపేట (Govindaraopet, Mulugu district) మండలం చల్వాయి గ్రామంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. చుక్క రమేశ్ అనే యువకుడు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో (Indiramma house grant) జరుగుతున్న అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాడు. వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయడంతో అతడిని స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా బెదిరించారు.బుధవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు రమేశ్ ఇంటికి వచ్చి బెదిరించగా, అదే విషయాన్ని మరోసారి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు. తర్వాత పోలీసులు రమేశ్ ఇంటికి వచ్చి అతడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని స్టేషన్కు రావాలంటూ ఆదేశించారు. ఈ వ్యవహారంతో రమేశ్ తీవ్ర మనోవేదనకు లోనై, సూసైడ్ నోట్ రాసి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మృతదేహంతో రోడ్డుపై ధర్నా
ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రమేశ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై మృతదేహంతో మూడు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్, సీపీఎం నేతలు మద్దతుగా పాల్గొన్నారు.ఘటన తీవ్రతను గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. రమేశ్ మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఈ ఘటనను ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు. మంత్రి సీతక్క బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రమేశ్ పంపిన వాట్సాప్ మెసేజ్లు, కాల్ రికార్డులు పరిశీలించి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ప్రశ్నించే గళాన్ని అణచివేయాలనే కుట్ర?
ఈ ఘటనపై అనేక రాజకీయ నేతలు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటమే నేరంగా మారిందని, కాంగ్రెస్ పార్టీ దౌర్జన్య ధోరణిని ఖండించారు. ఇకపై ఇలాంటివి జరగకూడదన్నదే ప్రజల ఆకాంక్షగా నిలుస్తోంది.
Read Also : KCR : కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల