ఐపీఎల్ 2025 సీజన్లో ముల్లాన్పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో పిచ్పై పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా కేకేఆర్ 95 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఇరు జట్ల స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకున్న పోరులో కింగ్స్ నిర్దేశించిన 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే చేతులెత్తేయడంతో పంజాబ్ 16 పరుగుల తేడాతో గెలిచింది.రఘువంశీ (28 బంతుల్లో 37, 5 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రీ రస్సెల్ (17) పోరాడారు. పంజాబ్ స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ (4/28), యాన్సెన్ (3/17) కేకేఆర్ను దెబ్బతీశారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్సిమ్రన్ (15 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. హర్షిత్ రాణా (3/25) ఆరంభంలోనే కింగ్స్ను దెబ్బతీయగా మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (2/14), వరుణ్ చక్రవర్తి (2/21) కలిసి మిడిల్, లోయరార్డర్ పనిపట్టారు.
పంజాబ్ ఇన్నింగ్స్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్కు ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ (12 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగానే ఇన్నింగ్స్ను ప్రారంభించినా ఈ ద్వయం నిష్క్రమించిన తర్వాత ఒక్కరంటే ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. నోకియా రెండో ఓవర్లో ఆర్య రెండు బౌండరీలు కొట్టగా వైభవ్ మూడో ఓవర్లో ప్రభ్సిమ్రన్.. 4, 6, 4, 4తో 20 పరుగులు రాబట్టాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో ఇవే తొలి, ఆఖరి మెరుపులు. 4వ ఓవర్లో బౌలింగ్ మార్పుగా వచ్చిన హర్షిత్ ఒకే ఓవర్లో ప్రియాన్ష్తో పాటు శ్రేయాస్ (0)నూ ఔట్ చేసి ఆతిథ్య జట్టుకు భారీ షాకిచ్చాడు. హర్షిత్ బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లతో అలరించిన ప్రభ్సిమ్రన్ కూడా.. అదే ఓవర్లో ఆఖరి బంతికి బ్యాక్వర్డ్ పాయింట్లో రమణ్దీప్ సింగ్ క్యాచ్తో పెవిలియన్ చేరాడు. అక్కడ్నుంచి పంజాబ్ ఇన్నింగ్స్ కోలుకోలేదు. నోకియా 9వ ఓవర్లో నెహాల్ వధేర (10) రెండు బౌండరీలు బాదినా నాలుగో బంతికి ఔట్ అయ్యాడు. ఇక ఈ సీజన్లో అత్యంత చెత్తగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ (7) మరోసారి తన వైఫల్య ప్రదర్శనను కొనసాగిస్తూ వరుణ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. సుయాన్ష్ (4), యాన్సెన్ (1)ను నరైన్ ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపాడు. శశాంక్ సింగ్ (18)ను 16వ ఓవర్లో అరోరా ఎల్బీగా వెనక్కిపంపగా అదే ఓవర్లో బార్ట్లెట్ (11) రనౌట్ అవడంతో కింగ్స్ ఇన్నింగ్స్కు తెరపడింది.

ఇంప్యాక్ట్
కేకేఆర్ కూడా 7 పరుగులకే ఓపెనర్లను కోల్పోవడంతో పంజాబ్లో ఆశలు రేగాయి. యాన్సెన్ తొలి ఓవర్లోనే నరైన్ (4)ను బౌల్డ్ చేయగా ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బార్ట్లెట్ రెండో బంతికే డికాక్ (2)ను ఔట్ చేసి కోల్కతాకు షాకిచ్చాడు. కానీ ఇంప్యాక్ట్ ప్లేయర్గా క్రీజులోకి వచ్చిన రఘువంశీ కెప్టెన్ రహానేతో కలిసి కోల్కతాను ఆదుకున్నాడు. ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీగా మలిచిన అతడు కింగ్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. యాన్సెన్ బౌలింగ్లో రెండు బౌండరీలు కొట్టిన రఘువంశీ బార్ట్లెట్ ఆరో ఓవర్లో 6, 4తో రెచ్చిపోయాడు.
Read Also: Punjab Kings : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్