భారతదేశం భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన దేశం. భాష విషయంలో తరచూ వివాదాలు చెలరేగడం మన దేశ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇదే తరహాలో తమిళనాడులో హిందీ భాషను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న వేళ, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు హిందీ భాషను పూర్తిగా తిరస్కరిస్తూ వ్యవహరిస్తున్న తీరుపై తనదైన శైలిలో స్పందించారు. హిందీ భాషపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తమిళనాడు వైఖరిని ప్రశ్నిస్తూ, తమ సినీ పరిశ్రమకి ఆర్థిక లావాదేవీలు హిందీ మార్కెట్ ద్వారా జరుగుతూనే ఉంటాయని గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
జనసేన ఆవిర్భావ వేడుకలో మాట్లాడుతూ, “మాట్లాడితే దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు. అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దు వద్దు అంటుంటే నా మనసులో ఒకటే అనిపిస్తుంది. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి పనిచేసే వాళ్లు అందరూ బీహార్ నుంచి కావాలి, కానీ హిందీని ద్వేషిస్తాం అంటారు. ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. అయితే, భాషా పరంగా జరుగుతున్న ఈ రాజకీయ చర్చపై ప్రముఖ నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రకాశ్ రాజ్ స్పందన
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్ రాజ్, ఎప్పటిలానే తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా #JustAsking హ్యాష్ట్యాగ్ తో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమేనని కొందరు అభిప్రాయపడితే, మరికొందరు తమిళనాడు లాంటి భాషా ఉద్యమాలు అవసరమేనంటూ వాదిస్తున్నారు.
భారతదేశంలో హిందీ భాషపై ఎప్పటికప్పుడు చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. భారతదేశం మల్టీలింగ్వల్ దేశం. ఇక్కడ ప్రతి భాషకు ప్రత్యేకత, విలువ ఉంది. హిందీని ప్రోత్సహించడం వేరు, దాన్ని బలవంతంగా రుద్దడం వేరు. ఈ అంశంలో ఏ నాయకుడైనా సమతుల్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భాషల మధ్య విభేదాలను కాదనుకుని, పరస్పర గౌరవంతో ముందుకు వెళ్లడం సమాజానికి మేలుకలిగించగలదు.