మొదటగా హాజరుకానున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల అరెస్టుతో పాటు వారి వాంగ్మూలం, అనుమానితుల వాంగ్మూలమే నమోదు కాగా మంగళవారం నుంచి సాక్షులతో పాటు బాధితుల వాంగ్మూలం నమోదు చేయనున్నారు.

సిట్ అధికారుల ఎదుట హాజరుకానున్న మహేష్ కుమార్ గౌడ
ఈ కేసును విచారిస్తున్న జూబ్లీహిల్స్ లోని ఎసిపి కార్యాలయంలో గల సిట్ అధికారుల ఎదుట మొదట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ (Mahesh Kumar Gowda) సాక్షిగానూ బాధితుడుగానూ వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా వున్నారు. ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతున్న సమయంలో మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్కు గురయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో తన ఫోన్ ట్యాపింగ్కు గురయ్యిందని మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా తెలిపారు. తనతో పాటు నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా అనేక మంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురైందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఉదయం 11 గంటలకు ఆయన ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి, జూబ్లీ హిల్స్ ఎసిపి వెంకటగిరి ఎదుట హాజరు కానున్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో నాలుగు వేలకు పైగా ఫోన్లు ట్యాప్
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు లో మొత్తం నాలుగు వేల 200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు తేలడం తెలిసిందే. ఇందులో రాజకీయ ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, సెలబ్రటీలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లు వున్నాయి. ఈ కేసులో మొదట కొందరి బాధితులను ప్రాథమికంగా విచారించిన పోలీసులు అధికారికంగా మంగళవారం నుంచి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. అప్పట్లో పదుల సంఖ్యలో రాజకీయ నేతలు, ప్రముఖులు తమ ఫోన్లు ట్యాపింగ్కు గురైందని
ఆరోపించడం విదితమే. వీరందరిని పోలీసులు విచారించేందుకు నిర్ణయించారు. విచారణలో భాగంగా వాంగ్మూలం ఇవ్వడంతో పాటు ట్యాపింగ్కు సంబంధించి తమ వద్ద వున్న ఆధారా లను పోలీసులకు ఇవ్వాల్సి వుంటుంది. సాక్షులు, బాధితుల వాంగ్మూలం సందర్భంగా ఈ కేసులో నిందితులుగా వున్న పోలీసులను కూడా పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి సమక్షంలోనే బాధితులను విచారించే వీలుందని తెలిసింది.
ఇదిలావుండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ బాస్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కూడా మంగళవారం నాడే సిట్ కార్యాలయంలో విచారణకు రానున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చే సమయంలోనే ప్రభాకర్ రావు కూడా విచారణకు వస్తుండడం గమనార్హం. ఈ కేసులో ప్రభాకర్ రావును ఇప్పటి వరకు మూడుసార్లు 26 గంటల పాటు విచారించడం తెలిసిందే. మంగళవారం నాడు నాలుగవ దఫా విచారణకు ఆయన హాజరవుతున్నారు.
Read also: Telangana: రాష్ట్రంలో యూరియా కొరత