ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు.ఆయన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలుపొందారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి 70 వేల ఓట్ల భారీ ఆధిక్యాన్ని ఆయన సాధించగా, ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇది పూర్తయ్యాక మెజారిటీ సంఖ్యలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్నికల ఫలితాలు దాదాపు స్పష్టమవడంతో పేరాబత్తుల రాజశేఖరానికి ఇప్పటికే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఈ విజయాలు మరింత ఉత్సాహాన్ని నింపాయని భావిస్తున్నారు.
రాజశేఖరం ఆనందం
తన విజయం పట్ల పేరాబత్తుల రాజశేఖరం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘన విజయం సాధించేందుకు తనను కూటమి అభ్యర్థిగా ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తమకు మద్దతుగా నిలిచిన పట్టభద్రుల ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వానికి పట్టబద్రుల తరఫున మాట్లాడుతానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతను నిర్లక్ష్యంగా చూడటమే కాకుండా, అనాలోచిత విధానాలతో ఇబ్బందులకు గురి చేశారని దుయ్యబట్టారు.

ప్రధాన లక్ష్యం
పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తన ప్రధాన లక్ష్యం యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం, విద్యా రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడం అని పేరాబత్తుల పేర్కొన్నారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కోసం వారికి న్యాయం చేయడమే తన ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా సమష్టిగా కృషి చేసిన ఫలితమే ఈ విజయమని పేర్కొన్నారు.
మద్దతుదారుల సంఖ్య
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుదారుల సంఖ్య పెరగడం విశేషం. ముఖ్యంగా యువత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు మద్దతు తెలపడం, ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనడం విజయాన్ని మరింత బలపరిచింది. ప్రత్యేకంగా తెలుగు దేశం పార్టీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషంగా మారింది. ఈ విజయంతో కూటమి నేతలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం పేరాబత్తుల రాజశేఖరం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అలాగే, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ భద్రత, విద్యార్థులకు స్కాలర్షిప్లు వంటి అంశాల్లో ప్రభుత్వం వైఖరిని ఎలా మార్చుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.