హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. ప్రతి విద్యార్థిని హాల్టికెట్స్తోపాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతిస్తున్నారు. 9 గంటలు సమయం దాటినా 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.

పరీక్షల కోసం 1,532 సెంటర్లు
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. 4,99,443 మంది అమ్మాయిలు ఉన్నారు. పరీక్షల కోసం 1,532 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇందులో 49 సెల్ప్ సెంటర్లు ఉన్నాయి. ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేస్తారు. ఇవాళ్టి నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఇదిలాఉంటే.. రేపటి (మార్చి 6వ తేదీ) నుంచి ఇంటర్ సెకండ్ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
వద్ద 100 మీటర్ల దూరంలో బీఎన్ఎస్ 163 (144సెక్షన్)
పరీక్షల పకడ్బందీ నిర్వహణ కోసం.. కంట్రోల్ కమాండ్ సెంటర్లో ప్రత్యేకంగా స్మార్ట్ నిఘాను పెడుతున్నారు. 45 పరీక్షా కేంద్రాలకు ఒక బృందం చేత నిఘాపెట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో బీఎన్ఎస్ 163 (144సెక్షన్) అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్ లేకుండా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు. హాల్ టికెట్ పై తప్పులుంటే ప్రిన్సిపాళ్లను, ఇతర అధికారులను సంప్రదించి సవరించుకోవచ్చు. పరీక్షా కేంద్రానికి వాచ్ లు, సెల్ ఫోన్లు, పేజీలు, క్యాలిక్యులెటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ముద్రిత సామాగ్రిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.