అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణులపై కఠినమైన వలస విధానాలు అమలు చేస్తున్న వేళ, సింగపూర్ మాత్రం భారతీయులకు సువర్ణావకాశం అందిస్తోంది. అక్కడి ప్రభుత్వం వీసా విధానాలను సవరించి, ఉద్యోగ వేతనాలను పెంచుతూ, నిపుణులకు దీర్ఘకాలిక పని అవకాశాలు కల్పిస్తోంది. ఓవైపు అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణుల్ని వలసదారులుగా చూపుతూ తమ దేశం నుంచి తరిమేస్తున్న వేళ సింగపూర్ వీరికి ఆహ్వానం పలుకుతోంది. అమెరికా వలస విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల్ని తమ దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇందుకు తమ వీసా విధానాల్ని సైతం సవరిస్తోంది. అంతే కాదు ఇలా తమ దేశానికి వచ్చే భారతీయ నిపుణులకు ఇప్పటివరకూ చెల్లిస్తున్న జీతాల్ని సైతం పెంచుతోంది.

వర్క్ పర్మిట్ ఎంత కాలమైనా సింగపూర్ లో ఉండవచ్చు
ఈ ఏడాది జూలై నుంచి సింగపూర్ లో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం వర్క్ పర్మిట్లు కలిగిన నిపుణులకు గరిష్ట పని కాల వ్యవధి నిబంధనను తొలగించబోతోంది. దీంతో విదేశీ నిపుణులు వర్క్ పర్మిట్ ఉంటే ఎంత కాలమైనా సింగపూర్ లో ఉండి పని చేసుకోవచ్చు. నిర్మాణ రంగం, ఓడల నిర్మాణం, తయారీ రంగంలో దీర్ఘకాలిక కెరీర్ కావాలనుకునే వారికి సింగపూర్ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతోంది. అలాగే ఇలా వచ్చే విదేశీ నిపుణుల పదవీ కాలాన్ని 63 ఏళ్లకు పెంచబోతోంది.
ఉద్యోగావకాశాలు పెంచాలని సింగపూర్ నిర్ణయం
మార్కెట్లో పోటీ తత్వం పెంచేందుకు వీలుగా మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ కు జీతాల్ని కూడా పెంచాలని నిర్ణయించింది. దీంతో భారతీయ నిపుణులకు కనీస వేతనం ఏడాదికి రూ.34.7 లక్షలకు పెంచుతోంది. దీన్ని జనవరి 2025 నుంచే వర్తింప చేయబోతోంది. అలాగే ఆర్ధిక వ్యవహారాల నిపుణులకు కనీస వేతనం ఏడాదికి రూ.38.4 లక్షలుగా నిర్ణయించింది.