Telangana : ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఈరోజు ప్రమాణ్య స్వీకారం చేయనున్నారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు నూతనంగా ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నిక
ఇందులో భాగంగా.. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. అలానే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, శ్రీపాల్రెడ్డి ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. వీరు మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.