ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని గోండా జిల్లాలో ఆదివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాలువలో (Sarayu Canal) పడిపోవడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు.
పూజార్ధంగా ఆలయానికి వెళ్తుండగా విషాదం
సిహగావ్ గ్రామానికి చెందిన 14 మంది భక్తులు ఖర్గుపూర్లోని పృథ్వీనాథ్ ఆలయాని (Prithvinath Temple in Khargharpur) కి పూజల కోసం బొలెరో వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో, వాహనం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి సరయూ కాలువలోకి దూసుకెళ్లింది. వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటియాథోక్ పోలీసు స్టేషన్ సిబ్బంది, గ్రామస్థులతో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీయగా, చిన్నారులు, మహిళలు సహా 11 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు నిర్ధారించారు. నలుగురు గాయపడినవారిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
జిల్లా ఎస్పీ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ, “బొలెరో వాహనం ఆలయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. 11 మంది మృతి చెందారు. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించాం” అని తెలిపారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందన
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ తలా రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలియజేశారు.
ప్రధానమంత్రి మోదీ స్పందన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తామని ప్రధాని కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: