Sonia Gandhi: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) మృతిపై కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. క్లిష్ట సమయంలో భారత్ స్పందించకపోవడం తటస్థత అనిపించుకోదని, అది నైతిక బాధ్యత నుంచి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆమె స్పష్టం చేశారు.
శాంతి, న్యాయం కోసం గొంతు విప్పే భారత్, నేడు చిరకాల మిత్రుడైన ఇరాన్ సంక్షోభంలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం మన దౌత్య విలువలకే విఘాతమని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. “గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ, ఇరాన్పై జరిగిన దాడిని ఎందుకు విస్మరిస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు. రష్యా, చైనా వంటి బ్రిక్స్ దేశాలు ఈ దాడిని ఖండిస్తుంటే, భారత్ మౌనం వహించడం ‘నిశ్శబ్ద ఆమోదం’ తెలిపినట్లుగా ఉందని ఆమె ఆరోపించారు.
Read Also: India Pakistan tension : జర్దారీ ఆరోపణ, భారత్ యుద్ధ సన్నాహాల్లో ఉందా?

ఇజ్రాయెల్ పర్యటన యాదృచ్ఛికమా?
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని వచ్చిన 48 గంటల్లోనే ఈ దాడి జరగడం కేవలం యాదృచ్ఛికం కాదని సోనియా గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ విధానం ఒక వ్యక్తి ‘వ్యక్తిగత’ దౌత్య కేంద్రంగా మారిపోయిందని విమర్శిస్తూ, ఇది గ్లోబల్ సౌత్ దేశాల్లో మన దేశ పరపతిని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఖమేనీ మృతికి కనీసం సంతాపం కూడా తెలపకపోవడం చారిత్రక మిత్రుడిని అవమానించడమేనని ఆమె అభివర్ణించారు.
పశ్చిమాసియాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రతను కేంద్రం విస్మరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఈ అంశాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బలంగా ప్రస్తావించాలని ‘ఇండియా’ కూటమి నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: