సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం కింద శివలింగం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఈ విషయంపై స్పష్టమైన సమాచారం ఉందని, ఆ శివలింగం వెలికితీయడానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి.

సంభ్లో మెట్ల బావి వెలికితీత ఘటనపై భారత పురావస్తు సర్వే (ASI) చర్యలపై అఖిలేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెట్ల బావి అన్వేషణకు సంబంధించి BJP ప్రభుత్వం అత్యుత్సాహంగా వ్యవహరిస్తోందని, ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. “ఇలాంటి తవ్వకాల ద్వారా అసత్య ప్రచారం చేయడం BJP నైజంగా మారింది” అని అఖిలేశ్ విమర్శించారు. తవ్వకాలు కొనసాగుతూ ఉంటే BJP తన సొంత ప్రభుత్వానికి కూడా ప్రమాదం తెచ్చుకోవచ్చని అఖిలేశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “వాళ్లు ఇలాగే తవ్వుకుంటూ పోతారు. ఒకరోజు తాము సృష్టించిన పరిస్థితుల వల్లే తమ ప్రభుత్వానికే ప్రమాదం జరుగుతుంది” అని ఆయన అన్నారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్న అఖిలేశ్, శివలింగం బయటపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి ఉంది.
అఖిలేశ్ వ్యాఖ్యలు, శివలింగ అంశం రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. అధికార BJP, ప్రతిపక్ష SP మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి.