తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ అధికార డీఎంకే పార్టీలో చేరారు. ఈరోజు చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివ్య సత్యరాజ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో డీఎంకే కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు.
డీఎంకే పార్టీలో చేరిన అనంతరం దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే డీఎంకే విధానాల పట్ల ఆకర్షితురాలినని తెలిపారు. ప్రజా సేవపై ఉన్న ఆసక్తితోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను ఫుడ్ న్యూట్రిషనిస్టుగా పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే పార్టీగా డీఎంకేను అభివర్ణించారు. ఈ కారణంతోనే డీఎంకేలో చేరినట్లు చెప్పారు. అలాగే, డీఎంకే పార్టీ మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీగా నిలిచిందని దివ్య కొనియాడారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం, ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉండడమే తనకు ఈ పార్టీపై విశ్వాసం కలిగించిందన్నారు. డీఎంకే మార్గదర్శకత్వంలో ప్రజల కోసం పనిచేయడానికి సన్నద్ధమని ఆమె తెలిపారు.
దివ్య సత్యరాజ్ 2019 ఎన్నికల సమయంలోనే స్టాలిన్ను కలిసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో దివ్య కుటుంబం ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని వెల్లడించింది. ఇప్పుడు ఆమె డీఎంకే పార్టీలో చేరడంతో ఆ ఊహాగానాలకు ముగింపు పలికారు. దివ్య సత్యరాజ్ చేరికతో డీఎంకేలో కొత్త ఉత్సాహం నెలకొంది. సత్యరాజ్ కూతురు కావడం వల్ల ఆమె రాజకీయాల్లోకి వచ్చిన పరిణామం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె పార్టీలో చేరడం, రాజకీయ రంగంలో తన కృషిని ఎలా కొనసాగిస్తారనే దానిపై అందరి దృష్టి నెలకొంది.