Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు ఎదురుదెబ్బ తగిలింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ రన్యారావు, మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసిన కర్ణాటక హైకోర్టు తాజాగా దానిని కొట్టివేసింది. దీంతో కాఫిఫోసా చట్టం కింద వారికి ఏడాది పాటు బెయిలు లభించదని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో రన్యారావుకు బెయిలు ఇవ్వకూడదని డీఆర్ఐ అధికారులు న్యాయస్థానంలో వాదనలు వినిపించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ ఎస్.విశ్వనాథ్ శెట్టి నిందితుల పిటిషన్ను తోసిపుచ్చారు.

ఈ కేసులో రన్యా సహా ముగ్గురిని అరెస్టు
గత నెలలో రన్యారావు దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బెంగళూరు విమానాశ్రయంలో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రన్యా సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ముందుగా ఆమె తనను ఇందులో బెదిరించి ఇరికించారని.. తనకేమీ సంబంధం లేదని తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ రవాణాలో కొన్నేళ్లుగా ఆమె ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసిందన్నారు. ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్ ఏ3గా కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని ఏప్రిల్ 7 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దీంతో బెయిల్ కోసం రన్యారావు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ విషయంలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం, 64వ సెషన్స్ కోర్టులో ఇప్పటికే ఆమెకు నిరాశ ఎదురైంది.
Read Also: దేవ కట్టా ‘మయసభ’లో చైతూ నటనపై వార్తల ఖండన