జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తతగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ఎయిర్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్తో ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీకి భద్రతా పరంగా, వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యత ఉంది.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు – భారత్కు అప్రమత్తత
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై గట్టి స్పందన ఇస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్కు అన్ని మార్గాల్లో గట్టి సందేశం ఇచ్చేలా భారత్ చర్యలు తీసుకుంటోంది. పాకిస్థాన్పై చుట్టుముట్టే విధంగా వ్యూహాత్మకంగా దౌత్యం, మిలిటరీ, ఆర్థిక పరంగా ఆంక్షలు విధిస్తూ – భారత్ క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. ఈ తరుణంలో ఎయిర్ చీఫ్తో భేటీ నిర్వహించడం ద్వారా దేశ వాయు పరిరక్షణ వ్యూహాలపై ప్రధాని సమీక్ష జరిపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని మోదీ ఇటీవల వరుసగా భద్రతా వ్యవహారాలపై సమీక్షలు చేస్తున్నారు. శనివారం నాడు భారత నావికాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కూడా సమావేశమయ్యారు. అంతకుముందు భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. ఈ భేటీలో కేంద్రం త్రివిధ దళాలకు ఉగ్రవాదులపై తగిన చర్యలు తీసుకునే పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. భారత వాయుసేన ఇప్పటికే యుద్ధ సన్నద్ధత చూపిస్తోంది. శుక్రవారం నాడు ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలను నిర్వహించడం ప్రత్యేక ఆసక్తికర అంశంగా నిలిచింది. ఇది యుద్ధ సమయంలో రహదారుల వినియోగంపై ట్రయల్గా భావించబడుతోంది.
Read also: Jawan: పాకిస్థాన్ యువతిని సీక్రెట్ గా పెళ్లాడి ఉద్యోగం పోగొట్టుకున్నభారత జవాన్