కశ్మీర్లోని పహల్గాం దాడికి సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన పహల్గాంలోని బైసరన్ లోయకు దాడికి రెండు రోజుల ముందే ఉగ్రవాదులు చేరుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి దాడిని పహల్గాంలో కాకుండా, ఆరు వ్యాలీ, ఎమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీ అనే మూడు ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో జరిపించాలని ఉగ్రవాదులు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ భద్రతా దళాల భారీ నిఘా ఉండటంతో ఆ ప్రణాళికను తాత్కాలికంగా విరమించి బైసరన్ లోయను టార్గెట్ చేసినట్లు సమాచారం.ఈ దాడికి సంబంధించి నలుగురు భూగర్భ కార్మికులు సహకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దాడికి సంబంధించి ఇప్పటివరకు 186 మందిని విచారించిన ఎన్ఐఏ అధికారులు, దాదాపు 20 మందిని ఉగ్రవాదులుగా గుర్తించి, మరికొందరిని అరెస్టు చేశారు. ఇంకా దాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్లోనే ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దక్షిణ కశ్మీర్లో తలదాచుకొని ఉన్నారని భావిస్తూ, అక్కడ ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. ముష్కరులకు కవర్ ఫైర్ ఇవ్వడానికి మరికొంతమంది ఉగ్రవాదులు బ్యాకప్గా ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. వారు అడవిలో ఎక్కువ కాలం ఉండగలిగే విధంగా తగిన ఆహార సామాగ్రి, అవసరమైన వస్తువులను ముందుగానే సిద్దం చేసుకున్నట్లు తెలిసింది.

Pahalgam : పహల్గాం కాకుండా మరో మూడు ప్రదేశాలే లక్ష్యం
ఇక మరోవైపు, దేశంలో మరో ఉగ్ర కుట్రను భద్రతా వర్గాలు విఫలమయ్యేలా చేశాయి. పంజాబ్లోని అమృత్సర్ జిల్లా భరోపాల్ గ్రామంలో బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ ద్వారా భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు పిస్టళ్లు, ఆరు మ్యాగజైన్లు, 50 లైవ్ రౌండ్లు వారి చెరపడ్డాయి. ముందస్తు సమాచారంతో ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఒక పెద్ద ఉగ్రదాడిని అడ్డుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అంతేకాక, గత వారం రోజులలో ఇదే ప్రాంతంలో ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు, 4.5 కిలోల ఆర్డిఎక్స్, నాలుగు పిస్టళ్లు, 220 బుల్లెట్లు, రెండు రిమోట్ కంట్రోలు, బ్యాటరీ ఛార్జర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలు చూస్తే ఉగ్రవాదులు వరుసగా దాడులకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దేశ భద్రతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రలను సమర్థవంతంగా నివారించేందుకు భద్రతా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
Read More : Terrorism : ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠిన హెచ్చరిక