Mamata Banerjee DA News: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం తెరలేపడానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కరవు భత్యం (డీఏ) బకాయిలను చెల్లించనున్నట్లు ఆదివారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఈ ప్రకటన చేయడం ద్వారా లక్షలాది మంది ఉద్యోగుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు.
Read Also: TMC vs BJP West Bengal: దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు
2008 నుంచి బకాయిలు.. మార్చి నుంచే చెల్లింపు
ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం, 2008 నుండి పేరుకుపోయిన డీఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనుంది. “మా ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఆర్ఓపీఏ (ROPA) 2009 డీఏ బకాయిలను 2026 మార్చి నుంచే ఉద్యోగులు అందుకోవడం ప్రారంభిస్తారు” అని మమత పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల కేవలం ప్రభుత్వ శాఖల వారే కాకుండా పంచాయతీలు, మున్సిపల్ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా లబ్ధి చేకూరనుంది.

Mamata Banerjee DA News: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో..
వాస్తవానికి ఈ డీఏ బకాయిల అంశంపై గత కొంతకాలంగా న్యాయపోరాటం సాగుతోంది. 2008 నుండి 2019 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలలో 25 శాతాన్ని ఈ ఏడాది మార్చి 31 లోపు చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ ఉండాలని, బకాయిలను దశలవారీగా పరిష్కరించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపిస్తూ ఈ నెలలోనే ఉద్యోగ సంఘాలు ‘పని నిలిపివేత’ నిరసన కూడా చేపట్టాయి.
రాజకీయ ప్రాధాన్యత
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎలాంటి వరాలు ప్రకటించడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ వెలువడటానికి కేవలం గంట ముందు మమత ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మరియు ఉద్యోగుల మద్దతు కూడగట్టడానికి దీదీ వేసిన ఈ ‘మాస్టర్ ప్లాన్’ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: