Arun Jaitley Stadium: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi) రాకతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఫుట్బాల్ ప్రేమికులు భారీ సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియానికి తరలివచ్చారు. ఉదయం నుంచే స్టేడియం వెలుపల బారులు తీరడంతో ఆ ప్రాంతమంతా అర్జెంటీనా జెర్సీ రంగులైన నీలం, తెలుపుమయంగా మారింది.
Read also: Lionel Messi: ఒకే ఫ్రేమ్లో మెస్సీ, సచిన్
అరుణ్ జైట్లీ స్టేడియంలో ‘మెస్సీ.. మెస్సీ’ నినాదాలు
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు ఢిల్లీకి చేరుకున్నారు. బ్యానర్లు, జెండాలు చేతబూని ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్లకు నెలకొనే సందడి ఫుట్బాల్ కోసం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏడుసార్లు బాలోన్ డి’ఓర్ విజేత అయిన మెస్సీని ప్రత్యక్షంగా చూడటం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు అధికారులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని మోహరించి, స్టేడియం(Arun Jaitley Stadium) చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. షెడ్యూల్ కంటే ముందుగానే గేట్లు తెరవడంతో అభిమానులు క్రమపద్ధతిలో లోపలికి వెళ్లగలిగారు. మెస్సీ మైదానంలోకి అడుగుపెట్టగానే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ప్రతీ ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో ఆ అపురూప దృశ్యాన్ని బంధించే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి మెస్సీ ఉదయమే ఢిల్లీకి చేరుకోవాల్సి ఉన్నా, పొగమంచు కారణంగా అతడు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఆలస్యమైంది. మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే మెస్సీ(Lionel Messi) నేరుగా లీలా ప్యాలెస్ హోటల్కు వెళ్లాడు. అక్కడ ఎంపిక చేసిన కొంతమందితో గంటపాటు మీట్ అండ్ గ్రీట్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ పర్యటనలో భాగంగా ఒక ప్రదర్శన మ్యాచ్, చిన్నారులకు ఫుట్బాల్ క్లినిక్, పలు ప్రైవేట్ సమావేశాల్లో పాల్గొననున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: