కేరళ హైకోర్టు (Kerala High Court) తాజాగా వెలువరించిన తీర్పు ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణలో మైలురాయిగా నిలిచింది. తిరువనంతపురంకు చెందిన జహాద్ (ట్రాన్స్మ్యాన్) మరియు జియా పావల్ (ట్రాన్స్వుమన్) అనే ట్రాన్స్జెండర్ (Transgender ) దంపతులు, తమ బిడ్డకు జనన ధృవీకరణ పత్రంలో తల్లి, తండ్రి అనే పదాలకు బదులుగా, లింగవిచారణ లేకుండా కేవలం “పేరెంట్స్” (తల్లిదండ్రులు) అనే పదాన్ని ఉపయోగించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ దంపతులు తమ లింగ గుర్తింపులపై సామాజిక వివక్ష తలెత్తకుండా, తమ బిడ్డ భవిష్యత్తులో గందరగోళం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పూనుకున్నారు.
అధికారులను పట్టించుకోకపోవడంతో కోర్ట్ ను ఆశ్రయించిన దంపతులు
గతంలో జారీ చేసిన జనన ధృవీకరణ పత్రంలో జహాద్ను తల్లి (ట్రాన్స్జెండర్)గా, జియాను తండ్రి (ట్రాన్స్జెండర్)గా పేర్కొనడం వీరికి అభ్యంతరకరంగా అనిపించింది. 2023 నుంచే ఈ మార్పు కోసం వారు అధికారులను కోరినప్పటికీ, వారి అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ ప్రాథమిక హక్కులను ఇది ఉల్లంఘించడమేనని వారు పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ జియాద్ రెహమాన్ ఏఏ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, బిడ్డకు తల్లిదండ్రుల పేర్లను లింగ రహితంగా నమోదు చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ తీర్పు ద్వారా కేరళ హైకోర్టు ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులను కేవలం మాటలతో కాదు, చర్యల ద్వారా సాక్షాత్కరించినట్లైంది. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులను పరిరక్షించడంలో ఈ తీర్పు దేశవ్యాప్తంగా మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్ సమాజం ఈ తీర్పును హర్షంతో స్వాగతించింది. ఇది భవిష్యత్లో లింగరహిత గుర్తింపులకు మరింత ప్రాధాన్యతనిచ్చే దిశగా, కొత్త చర్చలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Mehbooba Mufti: కశ్మీరీ పండిట్ల పునరావాసంపై ముఫ్తీ ప్రతిపాదన