ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ కు వెళ్లిన అతిశీ.. గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో అతిశీతో సక్సేనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆప్ ఓటమికి కారణం యమునా నది శాపమేనని వ్యాఖ్యానించినట్లు, దీనిపై గతంలోనే కేజ్రీవాల్ ను కూడా హెచ్చరించానని, ఆయన పట్టించుకోలేదని గవర్నర్ అన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలకు అతిశీ స్పందించలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించేందుకు గవర్నర్ సక్సేనా నిరాకరించారు.ఢిల్లీ ప్రజలకు తాగునీరందించే యమునా నదిలో కాలుష్యం స్థాయిలు తీవ్రంగా పెరిగిపోయాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆరోపించింది.

దీనిపై విచారణ జరిపి, నదిని పునరుద్ధరించే చర్యలను సిఫారసు చేసేందుకు గవర్నర్ నేతృత్వంలో ఓ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. 2023లో ఈ కమిటీ యమునా నది కాలుష్యంపై విచారణ చేపట్టగా కమిటీకి పూర్తి సహకారం అందిస్తామని అప్పటి సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కమిటీ ఏర్పాటు సరిగా లేదని, కమిటీకి సంబంధిత రంగానికి చెందిన నిపుణుడు సారథ్యం వహిస్తే బాగుంటుందని పేర్కొంటూ ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీపై స్టే విధించింది. రెండేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో యమునా నదిని కాలుష్యరహితంగా చేసే పని మొదట్లోనే ఆగిపోయింది. కాస్తా వివాదాస్పదం కావడంతో ఎల్జీ వీకే సక్సేనాకు, ఆప్ ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. ఆప్ సర్కారుకు యమునా నది శాపం తగులుతుందని ఎల్జీ పదే పదే హెచ్చరించారు.ఢిల్లీ 7వ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మొదలు పెట్టింది. అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేశ్ వర్మకే సీఎం పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. నరేంద్రమోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.