న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని పరిశ్రమ వర్గాలకు సూచించారు. పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరం కాబట్టి..జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని కోరారు. ఒకవేళ పన్నులు తగ్గిస్తే.. మరింత తగ్గించాలని కోరతారని, ఇది మనుషుల మనస్తత్వమని ఆయన వ్యాఖ్యానించారు. తాము కూడా పన్నులు తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని..కానీ దాని వల్ల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

పరిశ్రమ వర్గాలకు మంత్రి హామీ
ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి..పేదల అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ దార్శనికత అని మంత్రి అన్నారు. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు రెండేళ్లలోపు 9 శాతానికి తగ్గుతుందని పరిశ్రమ వర్గాలకు మంత్రి హామీ ఇచ్చారు. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతం ఉండగా.. యూఎస్, ఐరోపా దేశాల్లో 12 శాతం ఉందని తెలిపారు. మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా భవిష్యత్తులో దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించవచ్చన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.