దేశ రాజధాని ఢిల్లీ(Delhi ) లో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ (Covid) మహమ్మారి మళ్లీ తలెత్తడం ప్రజారోగ్య పరిరక్షణ పరంగా కీలకంగా మారింది. గత వారం రోజులలోనే ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదు కావడం, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 104కి చేరడం విశేషంగా పేర్కొనాల్సిన విషయం. ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 1,009 యాక్టివ్ కేసుల్లో ప్రస్తుతానికి మూడవ అత్యధిక సంఖ్యగా ఉంది.

రాష్ట్రాల వారీగా కోవిడ్ పరిస్థితి:
కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ముఖ్యమైన రాష్ట్రాల్లో కేసులు ఇలా నమోదయ్యాయి. కేరళలో 430 మంది, మహారాష్ట్రలో 209 మంది, ఢిల్లీలో 104 మంది కొవిడ్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 12 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇవన్నీ కలిపి చూస్తే, దేశవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ ఉధృతి క్రమంగా పెరుగుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
మరణాలు:
మహమ్మారి తీవ్రత పునరుద్ధృతమవుతున్నదని సూచించేలా, ఇటీవల కొన్ని మరణాలు కూడా సంభవించాయి. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
అయితే, కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదు. అందులో అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు ప్రస్తుతానికి కోవిడ్ రహితంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్ మళ్లీ తలెత్తుతుండటంతో ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. గతంలో ఎదురైన అనుభవం మనకు మార్గదర్శకంగా ఉండాలి. మళ్లీ మాస్క్ ధరించాలి ,రద్దీ గల ప్రదేశాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి, హైజీన్ పాటించాలి.