ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ఫోన్ చేతిలో పట్టుకుని రీల్స్, వీడియోలు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. పిల్లల్ని సోషల్ మీడియా ఉపయోగం నుంచి దూరంగా ఉంచాల్సిన తల్లిదండ్రులే ఇప్పుడు వారిని ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు చదువును పక్కన పెట్టి, సోషల్ మీడియా ఫేమ్ కోసం రాత్రింబవళ్లు వీడియోలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై, చదువు పై దుష్ప్రభావాన్ని చూపుతోంది.
సోషల్ మీడియా ప్రభావం
ఒక స్కూల్ ఉపాధ్యాయుడు తన అనుభవాన్ని పంచుకుంటూ విద్యార్థులపై సోషల్ మీడియా మోజు ప్రభావాన్ని వివరించాడు. తొమ్మిదో తరగతి విద్యార్థి పరీక్ష రాస్తూ అకస్మాత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. ఉపాధ్యాయుడు అతడిని నిద్రలేపేందుకు ముఖంపై నీళ్లు చల్లినా అతను స్పందించలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అతడికి డీ హైడ్రేషన్ సమస్య అని వైద్యులు తెలిపారు. కారణం, రెండు రోజుల పాటు తన మిత్రులతో కలిసి రీల్స్ చేయడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు వెల్లడించాడు.పైగా, తల్లి ప్రోత్సాహంతోనే తాను వీడియోలు చేసి నెలకు రూ.10,000 సంపాదిస్తున్నట్లు తెలిపాడు.ఈ రోజుల్లో పిల్లలు సెల్ఫీల మోజును మర్చిపోయి, రీల్స్తో స్కిట్స్ చేస్తూ సమాజాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. వీక్షకుల సంఖ్య పెరిగితే వచ్చే ఆదాయానికి ఆకర్షితులవుతున్నారు. దీనివల్ల సమాజంలో విద్యార్థుల దృష్టి చదువు మీద తగ్గి, అంతా సోషల్ మీడియా ఫేమ్ వైపే వెళ్లిపోతోంది.
రీల్స్ చేస్తూ
రీల్స్ చేయాలనే తపనలో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో సెల్ఫీల మోజు వల్ల చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. ఇదే తరహాలో, ఇటీవల ఐదుగురు విద్యార్థులు కొండపోచమ్మ సాగర్ వద్ద నీటిలో దిగి రీల్స్ చేస్తూ మృత్యువాత పడ్డారు.ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరుగుతోంది. హోటళ్లు, బ్రాండెడ్ దుకాణాలు, సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు వీరిని ఉపయోగించుకుంటున్నాయి. కొంతమంది యువత ఉద్యోగాలను వదిలేసి, పూర్తిగా సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ వైపే మొగ్గుచూపుతున్నారు.

పిల్లలపై ఒత్తిడి
ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఖరీదైన ఫోన్ కావాలంటూ తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేశాడు. వారు కాలేజీకి వెళ్లాక కొనిస్తామంటే వినకుండా ఇంట్లోనుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు విజయవాడలో అతడిని కనుగొని, చివరకు ఫోన్ కొనివ్వాల్సి వచ్చింది.
చదువుపై దృష్టి
సోషల్ మీడియా మోజు వల్ల విద్యార్థులు చదువుపై దృష్టి సారించడంలేదు.తల్లిదండ్రుల హెచ్చరికల కారణంగా కొంతమంది విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇటీవల, తల్లి మందలించినందుకు ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. రీల్స్ ద్వారా ఎక్కువ మంది ఫాలోవర్లు సంపాదించాలనే ఉద్దేశంతో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేసే యువత పెరిగిపోతున్నారు.సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. అయితే, దీనిని సమతుల్యం చేయడం చాలా ముఖ్యం. పిల్లల భవిష్యత్తు కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత బాధ్యత తీసుకోవాలి. చదువుపై ఏకాగ్రత పెంచేందుకు యువతకు సరైన మార్గదర్శనం అవసరం. సోషల్ మీడియా వినియోగం ఆహ్లాదకరంగా ఉండాలి కానీ, విద్యార్థుల జీవితాలను నాశనం చేయకూడదు.