పంటలకు మద్దతు ధర విషయంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోగునార పంటకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.305 మేర పెంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 2025-26 సీజన్లో ముడి జనపనార (టీడీ-3) క్వింటాలకు ధరను రూ.5,650గా నిర్ణయించారు. ఇది సాగు ఖర్చుకంటే దాదాపు 67 శాతం అధికమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను మీడియా వెల్లడించిన మంత్రి.. 2014-15లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టే నాటికి జనపనార క్వింటాలు ధర రూ.2,400 ఉండేదని చెప్పారు. ప్రస్తుత ధర దాని కంటే 2.35 రెట్లు అధికమని ఆయన తెలిపారు.

సాగు వ్యయంపై అన్నదాతలకు సగటున 66.8 శాతం మేర ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
జనపనార పంటకు 2003-04- నుంచి 2013-14 మధ్య కాలంలో కనీస మద్దతు ధర కింద రూ.400 కోట్లు చెల్లిస్తే.. మోదీ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో రూ.1,300 కోట్ల అందజేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా జనపనార పరిశ్రమపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా మొత్తం 40 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. గతేడాది 1.70 లక్షల మంది రైతుల నుంచి గోగునార కొనుగోలు చేశారు. ఒక్క పశ్చిమ్ బెంగాల్లోనే 82 శాతం మంది ఉండగా.. అసోం, బిహార్లో 9 శాతం మంది ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్ను మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని క్యాబినెట్ తీర్మానించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మిషన్ వల్ల దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలిగిందని ఆయన అన్నారు. ఆరోగ్య రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతిని మంత్రివర్గం సమీక్షించింది.